27, ఫిబ్రవరి 2012, సోమవారం

కమణీయం ఆ శిల్ప కళా సౌందర్యం















రుద్రేశ్వరుడు
ఆలయ ప్రాంగణం లోని ఒక మండపం
ఆలయంలోని పై కప్పు లోని భాగం
ఆలయం వెలుపల వినాయకుడు
నాగకన్య
అప్సరస



ఆలయ గోపురం

గత శివరాత్రి రోజున వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళాను. ఆ రోజున లింగ దర్శనం చేసుకోవడం ఒక పుణ్య కార్యమైతే, అదే సందర్భంలో ఒక అద్భుత శిల్పకళా సంపదను చూడటం అదృష్టం. వరంగల్ నుంచి డెభై కిలోమీటర్ల దూరంలో, ఏటూరు నాగారం వెళ్ళే దారిలో, పాలంపేట గ్రామంలో ఉంది ఈ రామప్ప దేవాలయం. మేడారం జాతరకు వెళ్ళాలన్నా ఈ మార్గంలోనే వెళ్ళాలి.
శివరాత్రి కాబట్టి కాస్త హడావిడి కనిపించింది. గుడికి వెళ్ళే దారిలో కొన్ని దుకాణాలు కూడా వెలిసాయి. మామూలు రోజుల్లో ఎ హడావిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో, గత వైభవం గంభీరంగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు, రుద్రేశ్వరుడు కైలాసం నుంచి రామేశ్వరానికి వెళ్తూ, దారిలో నందీశ్వరునితో సహా విశ్రమిస్తున్నట్టు ఉంటుంది.
రామప్ప దేవాలయ దర్శనం భక్తులకు, సౌందర్య ఆరాధకులకు ఏకకాలంలో తృప్తినిస్తుంది. అణువణువునా సౌందర్యాన్ని కూరి ఆరడుగుల ఎతైన నక్షత్రాకారపు పీఠంపై చెక్కిన ఆలయాన్ని అలా చూసి వచ్చేస్తే సరిపోదు. కాస్తంత తీరిక చేసుకుని నింపాదిగా , ఓపిగ్గా, ప్రతి మూలను, ప్రతి కోణం నుంచి చూడాలి. ఒకదాని వెంట ఒకటిగా పరుగెత్తే ఏనుగుల వరస, నాగకన్య, అప్సరసల వయ్యారపు భంగిమలు, కాపలాదారులుగా ఉన్న వినాయకులు, ప్రత్యేకంగా ఒక మండపంలో సర్వాలంక్రుతుడై కొలువు తీరిన నందీశ్వరుడు... ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో. శిలను మైనపు ముద్దను మలచినట్టుగా మలచి ఇలాంటి అపురూప కళాఖండాలను తీర్చి దిద్దిన శిల్పులకు నాయకత్వం వహించి ఒక సామ్రాజ్య చరిత్రను అజరామరం చేసిన రామప్ప పేరును గుడికి, గుడిలో ఉన్న లింగేశ్వరుడికి కూడా పెట్టడంలో అతిశయోక్తి లేదు.

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నా సిమ్లా పర్యటన

('టింబర్ ట్రయల్ ' తర్వాత...)

టింబర్ ట్రయల్ నుంచి మద్యాహ్నం 12 గంటల సమయంలో సిమ్లాకు బయలుదేరాం.

హర్యానాలోని అంబాలా నగరం నుంచి ఇండో - టిబెటన్ సరిహద్దులో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లోని ఖాబ్ అనే గ్రామం వరకు కల్క, సిమ్లాల మీదుగా వెళ్తుంది 459 కి.మీ.ల పొడవున ఉన్న 22 వ నంబర్ జాతీయ రహదారి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లా, డిల్లీ నుంచి 365కి.మీ.లు. చండీఘర్ నుంచి 115 కి.మీ.ల దూరంలో ఉంది.

దారిలోనే కసౌల్ అనే మరో హిల్ స్టేషన్ ఉంది. కాకపోతే మనం వెళ్ళే దారి నుండి ఎడమ వైపుకు 35కి.మీ.లు లోపలికి వెళ్లి అక్కడ కసౌల్ లోయలను చూసి , మళ్ళీ అదే దారిలో వెనక్కు రావాలి. వెళ్దామని అనుకున్నాం. కాని అప్పటికే మా అమ్మకు మోషన్ సిక్నెస్ (ట్రావెల్ సిక్నెస్ లేదా కినేటోసిస్) వల్ల వాంతులవుతుండటంతో పాటు, మా కారు డ్రైవర్ కూడా 'అక్కడ చూసేందుకు ఏమీ లేవు సర్, అలాంటి లోయలు దారి వెంబడి చాలా కనిపిస్తాయి.' అంటూ మమ్మల్ని వెనక్కులాగాడంతో కసౌల్ ను చూడకుండా నేరుగా సిమ్లాకే వెళ్లసాగాం. నిజానికి ఒకటి రెండు రోజులు విడిది చేసేందుకు కసౌల్ చాలా బాగుంటుంది.

అలాగే దారిలో సోలన్ జిల్లా లోని సోలన్ నగరం మీదుగా వెళ్ళేటప్పుడు అత్యంత మనోహరమైన లోయలు కనిపిస్తాయి. రోడ్డు ప్రయాణమైనా, రైలు ప్రయాణమైనా ఈ లోయల సోయగాలను చూస్తూ వెళ్ళవచ్చు. ఇక్కడ నుంచి మరో 70 కి.మీ.లు ఉంటుంది సిమ్లా. టింబర్ ట్రయల్ దాటిన తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ వాతావరణం చల్లబడుతూ ఆహ్లాదంగా మారింది. మూడున్నర గంటలకు సిమ్లా చేరుకొని మా డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లో దిగేటప్పటికి చలి ప్రారంభమైంది.

మేమిలా హోటళ్ళలో కాకుండా గెస్ట్ హౌస్లో దిగడం మా డ్రైవరుకు నచ్చలేదు. ఎందుకంటే సాధారణంగా ఇలా వచ్చే టూరిస్టులను హోటల్కు తీసుకువెడితే వాళ్లకు కమీషన్ దక్కడంతో పాటు వారు ఉండేందుకు ఒక రూమును ఇస్తారు. అందులోనే రెస్టారెంట్ ఉంటె భోజనం కూడా ఫ్రీగా పెడతారు. కాని మేము ప్రయాణం ఆసాంతం మా సొంత ఏర్పాట్లు చేసుకోవడం వల్ల అతనికి కూడా సొంత ఖర్చులు చేయక తప్పలేదు. దీని ఎఫెక్ట్ మా జర్నీ మొత్తం మీదా ప్రభావం చూపింది. అందుకే వీలైనంత వరకు రైలు లేదా బస్సు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ద్వారానే వెళ్ళడం మంచిది. లేదా ఎక్కడికక్కడ ప్యాకేజీలుగా మాట్లాడుకున్నా పరవాలేదు. ఇలా కాకుండా సొంత వాహనాలను అరేంజ్ చేసుకుంటే మోసాలకే ఎక్కువ ఆస్కారం. మనకు ప్రతీ చిన్న ప్రదేశాన్నీ ఆగి చూడాలనిపిస్తుంది. కాని డ్రైవర్లకు అంత ఓపిక ఉండదు. పైగా వాళ్ళు ప్రతి రోజూ చూసే ప్రదేశాలు కాబట్టి మనకున్నంత ఉత్సుకత వాళ్లకు ఉండదు. ఏది ఏమైనా మమ్మల్ని గెస్ట్ హౌస్ దగ్గర దింపిన తర్వాత మా తివారి , అదే మా డ్రైవర్ కనబడకుండా పోయాడు. కనీసం ఫోను కూడా లిఫ్ట్ చేయలేదు.

రూముకు వెళ్ళగానే మా అమ్మను డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళాలనుకున్నాం. అయితే ఇక్కడ హైదరాబాద్లోలా సిమ్లాలో వీధికో క్లినిక్ లేదు. హాస్పిటల్కు వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. అంత దూరం ఆమె రాలేననడంతో మేమే వెళ్లి టాబ్లెట్లు కొనుక్కొచ్చి ఇచ్చాం. స్నానాలవీ చేసి సాయంత్రం నేను , మా ఆవిడ, మా పెద్దాడు అలా నడచుకుంటూ బయటకు వెళ్ళాం.

(మిగతా 'కుఫ్రీ' లేబుల్తో... )

15, ఫిబ్రవరి 2011, మంగళవారం

నా సిమ్లా పర్యటన

('చండీఘర్' తర్వాత ...)

మా సిమ్లా పర్యటనలో మూడవ రోజు .
ఉదయం 6 గంటలకు చండీఘర్ నుండి ప్రైవేటు వాహనం (సిక్స్ సీటర్)లో సిమ్లాకు బయలుదేరాం. నిజానికి సిమ్లా వెళ్ళే వారంతా చండీఘర్ కు దాదాపు ౩౦ కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్కా రైల్వే స్టేషన్కు వెళ్లి అక్కడ నుండి టాయ్ ట్రైన్ లో సిమ్లాకు వెళ్తారు. సుమారు ఆరు గంటల పాటు టన్నెల్స్ , బ్రిడ్జిలు, కొండ మలుపులు, లోయలు , ఎతుపల్లాలు మద్య సాగే ఈ ప్రయాణం అద్భుతంగా ఉంటుందని అంటారంతా. మేముకూడా ట్రైన్లోనే వెళ్దామనుకున్నాం కాని మేము బుక్ చేసుకున్న టిక్కట్లు కన్ఫర్మ్ కాలేదు. అదీగాక ట్రైన్ ఉదయాన్నే బయలుదేరుతుంది. అంటే ముందు రోజు రాత్రికే కల్కా చేరుకోవాలి. అందుకని టాటా టవేరాలో రోడ్డు ప్రయాణానికి సిద్ధమయ్యాం.

హిమాలయాలలోని శివాలిక్ పర్వత శ్రేణిలో ఉంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం. చండీఘర్ దాటిన తర్వాత 22 వ నెంబర్ జాతీయ రహదారిపై సాగుతుంది ప్రయాణం. మేము వెళ్ళింది మే నెలలో. సాధారణంగా ఆ నెలలో చండీఘర్లో సైతం వేడిగానే ఉంటుంది. కాకపోతే మేము ప్రయాణం చేస్తోంది ఉదయం వేళ కాబట్టి చల్లగా , ఆహ్లాదంగా ఉంది.

దూరంగా కనబడుతున్నాయి శివాలిక్ పర్వతాలు. మైదాన ప్రాంతం వీడి నెమ్మదిగా పర్వత పాదాలను తాకుతోంది రోడ్డు. అప్పటికి చండీఘర్ దాటి 20 కిలోమీటర్లు వచ్చేశాం. పింజోర్ గ్రామాన్ని చేరుకున్నాం. ఇక్కడే వున్నాయి ప్రసిద్ది గాంచిన పింజోర్ గార్డెన్స్. వీటినే యాదవీంద్ర గార్డెన్స్ అని కూడా అంటారు. ఉదయం ఏడు గంటల సమయంలో గార్డెన్స్ కు చేరుకున్నాం. కాశ్మీర్లో ప్రసిద్ది గాంచిన మొఘల్ గార్డెన్స్ శైలిలోనే నిర్మించబడ్డాయి ఈ తోటలు. క్రీస్తు శకం 9-12 వ శతాబ్దంలో నిర్మించారు ఈ తోటల్ని. ఆ తర్వాత తిరిగి 17 వ శతాబ్దంలో ఆధునికీకరించారు.


ముఖద్వారం దాటి లోపలికి వెళ్ళాక చెట్లన్నిటికీ ఏవో కాయల్లా వ్రేలాడుతుండడం గమనించాం. పరీక్షగా చూస్తే అవన్నీ గబ్బిలాలు. చాలా పెద్ద సైజులో, కుప్పలు కుప్పలుగా, వేల సంఖ్యలో ఉన్నాయవి. ఎర్లీ మార్నింగ్ కావడంతో ఫౌంటైన్లను ఇంకా విప్పలేదు. చాలా ప్రశాంతంగా వుంది వాతావరణం. అక్కడే పచ్చిక బయలుపై కూర్చుని ఇంటి దగ్గర (హైదరాబాద్) నుంచి తెచ్చుకున్న అరిశెలు, చక్రాలు, సున్నుండ లను తిన్నాం.

బయటకు వచ్చాక పక్కనే ఉన్న భీమాదేవి ఆలయానికి వెళ్లాం. అయితే ఉదయం పది గంటలకు గాని గుడి తెరవరని చెప్పారు. వెనుతిరిగాం. అక్కడే ఉన్న షాపులో మా ఆవిడ కొన్ని డ్రై ఫ్రూట్లను కొన్నది. మా ప్రయాణంలో షాపింగ్ మొదలు. ఇకనుంచి లగేజి పెరగడం మొదలవుతుంది. కారెక్కి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టాం.

ఒక అయిదారు కిలోమీటర్ల దూరం వెళ్ళాక కల్కా పట్టణం గుండా వెళ్తున్నప్పుడు రహదారి పక్కనే ఒక గుడి కనబడింది. మా తివారి (డ్రైవరు) ని అడిగితే కాళీమాత గుడి అని చెప్పాడు. మా ఖర్మ కొద్దీ అతనికి ఒక విశిష్ట గుణం ఉంది. మేము ఆపమని చెపితేనే తప్ప ఎక్కడా కారును ఆపడు. ఎంత చూడ తగిన ప్రదేశమైనా సరే! దాటుకుంటూ గమ్యానికి వెళ్లి పోతూ ఉంటాడు. ప్రస్తుతం సిమ్లాకు బయలుదేరాం కాబట్టి అతను సిమ్లా వరకు ఎక్కడా ఆగడు. అదీ అతని పాలసీ. అదేమయ్యా అని అడిగితే అక్కడ చూడ్డానికి ఏమీలేదు అంటాడు. మా అంతట మేము తెలుసుకుని ,చూడాలనుకున్న ప్రదేశాలను మాత్రమే చూడగలిగాం. మాకు తెలియని ప్రదేశాలను మాత్రం మిస్సయ్యాం. గుడి గురించి నేను ముందే తెలుసుకున్నాను కాబట్టి కారును ఆపమని చెప్పాను . పార్కింగ్ ప్లేస్ లేదని, సిమ్లాకు వెళ్ళేటప్పటికి లేటవుతుందని ఏదో ఏదో నసిగాడు. గట్టిగా ఓ క్లాసు పీకేసరికి దారికి వచ్చాడు.

ఇక్కడ కొలువున్న కాళికాదేవి పేరుమీదే కల్కా అన్న పేరు ఆ పట్టణానికి వచ్చింది. మా సిమ్లా ప్రయాణంలో మేము దర్శించుకున్న మొదటి ఆలయం ఇదే. ఇక్కడి గుళ్ళన్నీ వైవిధ్యమైన రీతిలో నిర్మించబడి ఉన్నాయి. మూలవిరాట్టుకు చేసే అలంకారం కూడా విభిన్నంగా ఉంటుంది. తృప్తిగా దేవిని దర్శించుకుని మళ్ళీ ప్రయాణాన్ని సాగించాం.

టింబర్ ట్రయిల్: 22 వ జాతీయ రహదారిపై చండీఘర్ నుండి ౩౦ కిలోమీటర్ల దూరంలో, పింజోర్ గార్డెన్స్ కు 8 కి.మీ.ల దూరంలో, హర్యానా రాష్ట్ర సరిహద్దు దాటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాలకు రహదారి పక్కనే కనబడుతుంది టింబర్ ట్రయిల్. ఇది సోలన్ జిల్లాలో పర్వానూ అనే నగరానికి చేరువలో ఉంది. ఇంతకీ ఏమిటీ టింబర్ ట్రయిల్?


ఇదొక ప్రఖ్యాతి గాంచిన రిసార్ట్. సముద్రమట్టానికి ఐదు వేల అడుగుల ఎత్తులో , శివాలిక్ పర్వతాల మధ్యలో ఉన్న అందమైన రిసార్ట్. ఈ రిసార్ట్ లోనే రెండురోజులు బస చేసి ప్రకృతి అందాలను ఆస్వాదించ వచ్చు. అలాంటి సకల సౌకర్యాలూ ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ రిసార్ట్ లను చేరుకోవాలంటే ఈ పర్వతంపై ఉన్న రహదారి నుంచి 1.8 కి.మీ.ల దూరంలో మరో పర్వతంపై ఉన్న రిసార్ట్స్ కు కేబుల్ కార్ ద్వారా వెళ్ళాలి. అద్భుతమైన అనుభవం అది. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఈ కేబుల్ కార్ అందుబాటులో ఉంటుంది. రిసార్ట్ బుక్ చేసుకున్న వాళ్ళే కాక మామూలు పర్యాటకులు కూడా కేబుల్ కార్ ఎక్కి రిసార్ట్లో కాసేపు గడిపి రావొచ్చు. మనిషికి 350 రూపాయల చార్జి.

కేబుల్ కార్ లో వచ్చేందుకు పేరంట్స్ భయపడటంతో నేను, మా ఆవిడ, మా ఇద్దరు పిల్లలు కేబుల్ కార్ ఎక్కాం. చూస్తూ చూస్తూ ఎంతో ఎత్తుకు... రెండు కొండల మధ్య గాలిలో వ్రేలాడుతూ... ఎక్కడో పాతాళాన ఉన్నట్టుగా సన్నటి పాపిటలా వంపులు తిరుగుతూ పారుతున్న కౌసల్యా నదిని ఆశ్చర్యంగా చూస్తూ... ఒక వైపు భయం, మరో వైపు ఉత్కంటత. మా పెద్దాడు వీడియో కవరేజ్ చేస్తుంటే, నేను డిజిటాల్ కెమెరాతో ఫోటోలు తీస్తూ పోయాను. (పక్కన ఉన్న ఫోటోలో ఏరియల్ వ్యూ చూడ వచ్చు.) మధ్యలో మరో కొండ మీద ఏదో గుడి. అమ్మవారి గుడే. దాదాపు పది నిమిషాల ప్రయాణం తర్వాత పదకొండు గంటల సమయంలో రిసార్ట్స్ ను చేరుకున్నాం. అక్కడ పిల్లలు కాసేపు రైడ్స్ ను ఎంజాయ్ చేసారు. రిసార్ట్స్ లోని హోటల్, స్విమ్మింగ్ పూల్, బార్ , వివిధ ప్రదేశాల నుంచి కనబడే ప్రకృతి దృశ్యాలు చాలా బాగున్నాయి. ఒక గంట పాటు అక్కడ గడిపి తిరిగి కేబుల్ కార్ ద్వారా వెనక్కి వచ్చేసాం.

మధ్యాహ్నం పన్నెండు గంటలకు టింబర్ ట్రయల్ నుండి సిమ్లాకు బయలు దేరాం.
(మిగతాది 'సిమ్లా' లేబుల్ తో ...)

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నా సిమ్లా పర్యటన


('కురుక్షేత్రం ' తరువాయి..)

కురుక్షేత్ర నుండి చండీఘర్ దాదాపు 100 కి. మీ.లు. ఒకటవ నంబరు జాతీయ రహదారి పై అంబాలా వరకు ప్రయాణించి అక్కడనుండి కుడి వైపుకు 22 వ జాతీయ రహదారి గుండా చండీఘర్ చేరుకోవాలి. ఇది కేంద్రపాలిత ప్రాంతం. అంతేకాకుండా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని. సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉంది.

దేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన మొదటి నగరం చండీఘర్. నగరం అంతా నలుచదరపు గళ్ళలాగా విభజించబడి ఉంటుంది. వీటన్నిటికి సెక్టార్ ఒకటి,రెండు,...అరవై మూడు అని పేర్లు ఉంటాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రముఖ ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బ్యుసర్ పర్యవేక్షణలో ఈ నగరం నిర్మిచబడింది. నివాస, పని, ఆరోగ్యం, ఆత్యాద్మిక ప్రాంతాలనే నాలుగు ప్రాంతాలుగా నగరం విభజించబడింది. నివాసప్రాంతాలలో కేవలం ఇళ్ళు, స్కూళ్ళు, చిన్న చిన్న పార్కులు ఉంటాయి అంతే. వర్కింగ్ ఏరియాలో ఆఫీసులు, పరిశ్రమలు ఉంటాయి. సెక్టార్ 17 నగరానికి గుండె లాంటిది. ఈ సేక్తార్లోనే బస్టాండ్ నుంచి పాలనా యంత్రాంగపు కార్యాలయాలన్నీ ఉంటాయి.

మేము సెక్టార్ 15 లో ఉన్న మా డిపార్ట్మెంట్ గెస్ట్ హౌస్ లో దిగాం. చండీఘర్లో చూడాల్సిన ప్రదేశాలు..సుఖన లేక్, రాక్ గార్డెన్ , చండీ మాత ఆలయం.. అంతే. వీటిల్లో తప్పనిసరిగా చూడాల్సింది రాక్ గార్డెన్.

మా ప్లాన్ ప్రకారం చండీఘర్ సైట్ సీయింగ్ అనేది తిరుగు ప్రయాణంలో చేయాలనుకున్నాం. అందుకని ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం ఆరు గంటలకు సిమ్లాకు ప్రయాణం అయ్యాం.

(మిగతాది 'సిమ్లా' శీర్షికతో...)

10, ఫిబ్రవరి 2011, గురువారం

నా సిమ్లా పర్యటన

డిల్లీ నుంచి అంబాలా వెళ్ళే ఒకటవ నంబరు జాతీయ రహదారిపై పానిపట్టు, కర్నాల్ లను దాటిన తర్వాత తానేసర్ కంటే ముందు పిప్లీ అన్న ఊరోస్తుంది. అక్కడ నుండి ఎడమకు తిరిగి 6 కి.మీ. లు లోపలికి వెళ్తే వస్తుంది కురుక్షేత్రం. కురుక్షేత్రం అన్నది హర్యానా రాష్ట్రంలోని ఒక జిల్లా కూడా. అక్కడికి వెళ్లకముందు హైవే మీదే ఉన్న ఒక ధాబా దగ్గర భోజనం చేసేందుకు ఆగాం.

అక్కడ నాన్వెజ్ దొరకడం చాలా తక్కువ. మా ప్రయాణం మొత్తంలో ఆలుగడ్డ కూర, రాజమ పప్పు, రొట్టెలతో కూడిన భోజనమే చేసాం. అక్కడ ఆలూ ఎక్కువగా పండుతుంది. కందిపప్పు , చింత పండు అసలు వాడరు. ఉల్లి, కీరా వంటి వెజిటబుల్ సలాడ్ ను ఇక్కడ మనకు ఫ్రీగానే ఇస్తారు. కాని అక్కడ ౩౦-40 రూపాయలు వసూలు చేస్తారు. చివరికి పెరుగు కావాలన్నా డబ్బులు పెట్టాల్సిందే. రైస్ దొరుకుతుంది కాని అన్ని చోట్ల ఉండదు. ఉన్నా ఆ లావాటి మెతుకులు తినడం కాస్త కష్టం. ఇక డ్రైవరుకు మనం ప్రత్యేకించి తినిపించానక్కర లేదు. దాబా లేదా హోటల్ వాళ్ళు వారికి ఉచితంగానే eపెడతారు. అయితే పాసెంజరు బిల్లులోనే ఆ చార్గీలను ఇరికించేందుకు చూస్తారు. మా మొదటి మజిలీలో అదే జరిగింది. eఅయితే బిల్లు చెక్ చేసుకోడంతో బయటపడి అడిగితే డ్రైవర్ తనే పే చేస్తానని బిల్డప్ ఇచ్చాడు. నిజానికి వాళ్ళ దగ్గర ఫ్రీ ఫుడ్డు, మన ఖాతాలో డబ్బులు రెండూ నొక్కే మాయాజాలం అన్నమాట. అందుకే ప్రైవేటు వాహనాల పై వెళ్ళేవారు ఇటువంటి మోసాల పట్ల అప్రమతంగా ఉండాలి. అలాగే డిస్టెన్స్ కూడా మజిలీ చేసిన ప్రతీ చోటా నోట్ చేసుకోవాలి. మనకూ ఏది ఎక్కడనుంచి ఎంత దూరం ఉందొ తెలుస్తుంది. మీటరు సరిగా ఉందొ లేదో కూడా తేలుతుంది. తేడా వచ్చి వాహనాన్ని వెనక్కు పంపాలన్నా రిటర్న్ కూడా ఇచ్చిపంపాలి. కాబట్టి ట్రావెల్స్ వాళ్ళ తో చాలా జాగ్రతగా వ్యవహరించాలి. ఇక మన టూర్ ఎలా జరుగుతుంది అనేది మనతో పాటు వచ్చే డ్రైవరును బట్టి, అతనితో మనం వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది. రోజు వారీ బత్తా రెండొందలు ఇస్తున్నా , అప్పుడప్పుడూ కాస్త అతని కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉత్తర భారతదేశంలో , ఈ టూర్ కు సంబంధించి చేసిన మొదటి భోజనం , కాబట్టి వెరైటీని బాగానే ఎంజాయ్ చేసాం.

ఉదయం 11 గంటలకు డిల్లీ నుంచి బయలుదేరిన మేము మద్యాహ్నం ౩ గంటలకు కురుక్షేత్రం చేరాం. కురుక్షేత్రం అనేది మహాభారత ఇతిహాసానికి సంబంధించిన ఘట్టాలను వివరించే అనేక ప్రదేశాలున్న ఒక క్షేత్రం. కురు అనే ఒక రాజు పేరుమీద ప్రస్సిద్ది గాంచిన ప్రాంతం. ఇక్కడ బ్రహ్మ సరోవర్, జ్యోతి సర్, భద్రకాళి టెంపుల్, స్తానేస్వర్ టెంపుల్ అనే అనేక గుడులు, తటాకాలు ఉన్నాయి. ఒక్కొక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. జ్యోతిసర్ అన్న చోట కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడంట. భీష్మ కుండ్ అన్న చోటే భీష్మ పితామహుడు అంపశయ్యపై పుణ్యకాలం కొరకు వేచి ఉన్నాడంట.

మొదట మేము బ్రహ్మ సరోవర్ అన్న చోటుకు వెళ్లాం. ఒక పెద్ద సరస్సు ఉందక్కడ. పక్కనే ఒక శివాలయం ఉంది. ఇక్కడ నుంచే బ్రహ్మ తన సృష్టిని మొదలు పెట్టాడంట. ఈ సరస్సులో అమావాస్య నాడు వచ్చే గ్రహణం రోజున, సూర్య గ్రహణం రోజున స్నానం చేస్తే పాపాలన్నీ తుడిచిపెట్టుకు పోవడంతో పాటు, అశ్వమేధ యాగం చేసినంత ఫలం సంప్రాప్తిస్తున్దంట. ఇక మిగిలిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళమంటే ఈ ప్రదేశాల గురించి నాకు తెలీదు, ఎవరైనా జీపు వాళ్ళని మాట్లాడనా? అని డ్రైవర్ అనేటప్పటికి మాకు నోట మాట రాలేదు. ఎవరినో మాట్లాడే దానికి ఇతనిని పెట్టుకున్నది ఎందుకు? అతనితో మొదటే తగవు పెట్టుకోవడం ఇష్టం లేక జీపు వాళ్ళని అడిగితే 600 రూపాయలు అడిగారు. అప్పటికే ఎండ వేడికి అలసి పోయి ఉండడం చేత , త్వరగా చండీఘర్ వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని ఉండటం చేత , అక్కడ నుండి బయలు దేరాం. ఈ రకంగా ఆదిలోనే హంస పాదు అన్న చందాన గీతోపదేశం జరిగిన ప్రదేశాన్ని చూడకుండానే వెనుతిరిగాం.

రాత్రి 7 గంటల సమయంలో చండీఘర్ చేరుకున్నాం.
(మిగతాది 'చండీఘర్ ' శీర్షికతో..)

26, మే 2010, బుధవారం

నా సిమ్లా పర్యటన

వేసవికాలం సమీపిస్తోంది. సమ్మర్ టూర్ కోసం ప్లాన్ చేసుకోవలసిన సమయం ఇది. అందుకే నా టూర్ అనుభవాల గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. చదువరులకు కొంతలో కొంత బ్లాగు ఉపయోగపడుతుందని నా ఆలోచన.

ప్రతి వేసవిలోనూ ఏదో ఒక పర్యాటక కేంద్రానికి, ముఖ్యంగా హిల్ స్టేషన్లకి వెళ్ళడం మాకు ఇష్టం , అలవాటు కూడా. ఎప్పటినుంచో సిమ్లాకి వెళ్లాలని కోరిక. కోరిక క్రిందటి వేసవిలో తీరింది. నాలుగు నెలల ముందుగానే ప్రణాళికలు మొదలయ్యాయి. ముందుగా బడ్జెట్ అంచనా వేస్తే ఎనభై వేల దాకా తేలింది. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాం కాబట్టి పలానా ప్రదేశాన్ని కూడా చూసొద్దాం అంటూ ఒక్కో ప్రదేశాన్ని కలుపుకుంటూ పోయే సరికి అంత బడ్జెట్ తేలింది. మా ఆవిడ ప్రభుత్వోద్యోగి కావడంతో రెండు బ్లాకుల ఎల్టీసిని పర్యటన కోసం వాడుకోవాలనుకున్నాం. అలాగే సిమ్లా, మనాలిలలో ఉన్న వాళ్ళ హాలిడే హోమ్స్ లో గదులను బుక్ చేసాం. .పి. ఎక్స్ ప్రేస్సుకు వెళ్ళేటప్పుడు సెకండ్ ఏసిలో , వచ్చేటప్పుడు థర్డ్ ఎసి లో టికెట్లు బుక్ చేసాం. అన్నీ ఫిబ్రవరిలోనే.
అంత ముందుగా బుక్ చేసుకున్నా కన్ఫర్మ్ కావడానికి మూడు నాలుగు రోజులు పట్టింది. అందుకే సమ్మర్ టూర్ ను ఎప్పుడూ ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. డిల్లీ నుంచి మిగతా టూర్ కోసం సిక్స్ సీటర్ వెహికిల్ బుక్ చేసాం. కిలోమీటరుకు తొమ్మిది రూపాయలు చొప్పున మాట్లాడుకున్నాం. నిజానికి ఢిల్లీ నుంచీ షిమ్లా వరకు రైలు సౌకర్యం ఉంది. అయితే లగేజిని, మా బృందంలో ఉన్న పెద్దలు, పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని టాక్సీ లో వెళ్ళాలనుకున్నాం. అదెంత పొరబాటో తర్వాత తెలిసింది.
టూరుకు వెళ్ళేంత వరకు రోజుకో ఆలోచన. రోజుకో ప్రణాళిక. ఎంతో ఉత్సుకత. అక్కడి ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు స్వీప్ పనోరమ సౌకర్యం ఉన్న సైబర్ షాట్ కెమెరాను కొన్నాం. దాదాపు ప్రతిరోజు టూర్ గురించి కాంత డిస్కషన్. అంతకు ముందే వెళ్లి వచ్చిన వాళ్ళు తగిన సజెషన్స్ ఇచ్చారు. నేనైతే ఇంటర్నెట్లో బోలెడంత సమాచారాన్ని సేకరించాను. అయితే టూమచ్ ఇన్ఫర్మేషన్ కూడా కాస్త కన్ఫ్యూషన్ను తెచ్చి పెడుతుంది. ముందుగా మేమనుకున్న రూట్ ఇది.
హైదరాబాద్ -డిల్లీ- చండీఘర్-సిమ్లా-కులు-మనాలి-భాక్రానంగల్ డ్యాం-చండీఘర్ -డిల్లీ-హైదరాబాద్

ఆదివారం ఉదయం ఎపి ఎక్స్ ప్రెస్ ఎక్కి డిల్లీకి బయలుదేరడంతో మా ప్రయాణం మొదలైంది.
మొదటి రోజు: రైలు ప్రయాణంతోనే గడిచింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1670కి.మీ. వేసవికాలమే అయినా ఎసి కోచ్ కాబట్టి ప్రయాణం హాయిగానే సాగింది.
రెండవ రోజు: ఉదయం తొమ్మిదిన్నరకు న్యూడిల్లీ చేరుకున్నాం. అక్కడ మా ఆవిడ కొలీగ్ ఒకాయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ట్రావెల్స్ వాళ్ళ వెహికిల్ ను మాట్లాడి పెట్టింది ఆయనే. వాహనాన్ని కూడా వెంట పెట్టుకోచ్చిన ఆయన ముందుగా వాళ్ళ ఆఫీసుకు తీసుకువెళ్ళి మర్యాద చేసి మమ్మల్ని చండీఘర్ కు సాగనంపారు.

డిల్లీ నుంచి చండీఘర్ కు మా ప్రయాణం ఉదయం పదకొండున్నరకు మొదలైంది. మా డ్రైవర్ పేరు తివారి. ఎసి వెయ్యమంటారా అని అడిగాడు. వేస్తే కిలోమీటరుకు మరో రూపాయి అదనంగా ఇవ్వాలి. ఎలాగు వెళ్తోంది చల్లటి ప్రదేశానికి కదా, వద్దులే అన్నాం. డిల్లీ పొలిమేరలకు వచ్చే సరికి వడగాడ్పుల సెగలు మొదలయ్యాయి. హైదరాబాద్ చాలా నయమనిపించింది. నిజానికి మేము హైదరాబాద్ నుంచి బయలుదేరే సమయానికి అక్కడ ఎండలు అదర కొడుతున్నాయి. తప్పించుకుని వెళ్తున్నాం కదా అనుకుంటే ఢిల్లీ ఇంకా ఘోరంగా ఉంది. హైవే మాత్రం సూపర్. స్ట్రైట్ లైన్ మాదిరిగా తిన్నగ్గా , విశాలంగా ఉంది. ఇది ఒకటవ నంబర్ జాతీయ రహదారి. పానిపట్,కురుక్షేత్ర, అంబాల, అమృతసర్ మీదుగా వెళ్తుంది.

కురుక్షేత్ర చూస్తారా అడిగాడు తివారి. మా ప్లాన్నింగ్ లో కురుక్షేత్రం, పానిపట్టు ఉన్నాయి కాబట్టి ముందుగా పానిపట్టుచూస్తాం అన్నాం. భారతదేశ చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగిన మూడు యుద్ధాలు జరిగాయి అక్కడ. అయితే ఇప్పుడుఅక్కడ చూసేందుకు ఒక మ్యూజియం తప్ప ఇంకేమీ లేవు అని డ్రైవరు చెప్పడంతో పానిపట్టు సందర్శన కాన్సిల్అయ్యింది. తరువాత కురుక్షేత్రం. మహాభారత యుద్ధ భూమి. గీతాసారం భోధించిన పవిత్ర స్థలం. ఎవరికైనాచూడాలనిపిస్తుంది కదా! డిల్లీ నుంచి కురుక్షేత్రం 166 కిలో మీటర్లు.
(మిగతాది 'కురుక్షేత్ర' శీర్షికతో ఉన్న బ్లాగులో చదవండి)